స్కూల్ పిల్లలకు దాదాపు రోజంతా పాఠాలు ,హోమ్ వర్క్ , ఏతావాతా సమయం దొరికితే టి.వి. లాంటి మాధ్యమాలు తప్పితే మిగతా మానసిక వికాసం లేకుండా పోతున్న పరిస్ధితి మనం చూస్తున్నాం. బాహ్య ప్రపంచ జ్ఞానాన్ని పెంచే ఏ రకమైన అంశం కూడా పిల్లలకు అందుబాటులో లేకుండా పోయేటంత పోటీప్రపంచం దీన్ని మరింత జఠిలం చేస్తున్నది. ఈ నేపధ్యంలో ప్రపంచాన్ని వీక్షించడానికి అద్భుతసాధనమైన పుస్తకపఠనాన్ని ప్రోత్సహించాలని తలపెట్టింది "మనలైబ్రరి , జహీరాబాద్". కధారచన కూడా పుస్తకపఠనాన్ని ప్రేరేపించే బలమైన సాధనం. కధలు వ్రాయాలంటే మహారచయితలే కానక్కర్లేదు. స్కూల్ లో చదివే పిల్లల్నే రచయితలు/రచయిత్రులుగా ప్రోత్సహించి కధారచన పోటీలు నిర్వహించాము. దాదాపు 30 స్కూల్స్ నుండి 150మంది కధలు వ్రాశారు. అందులో 30కధల్ని ఎంచుకుని "జహీరాబాద్ పిల్లల కధలు" అన్న పేరిట పుస్తకం ప్రచురించాము. ఈ పుస్తకావిష్కరణ ది.3-2-11(గురువారం)నాడు జరిగింది. పుస్తకావిష్కరణకు ముఖ్యఅతిధిగా ప్రముఖ విద్యావేత్త, శాసనమండలి సభ్యులు శ్రీ.చుక్కారామయ్య విచ్చేసి సభికుల్ని ఉత్తేజపర్చేలా ప్రసంగించారు. 300మందికి పైగా విద్యార్ధినీ విద్యార్ధులు, 100మందికి పైగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు,మేధావులు హాజరైన ఈ సభ పుస్తకపఠనం, కధారచన వంటి అంశాలపై ఆసక్తిని రేకెత్తించడంలో విజయవంతమైందని చెప్పుకోవచ్చు.
జనవిజ్ఞానవేదిక మెదక్ జిల్లాలోని అన్ని మండలాల్లో వీలైనంతగా ఇటువంటి కార్యక్రమాలు చేపడితే భావి తరాలకు ఒక మంచి ఒరవడిని అందించిన వారమౌతామని భావిస్తున్నాను.
స్వేచ్ఛ-విజ్ఞానాభివందనాలతో,
డా.శివబాబు,జహీరాబాద్
No comments:
Post a Comment